
కార్యాల నిబంధన అంటే ఏమిటి?
21/07/2026
నేను ఇరుక్కుపోయినట్లు అనిపించినప్పుడు
28/07/2026అతి పరిశుద్ధ స్థలం
“నేను వారి మధ్య నివసించునట్లు” (నిర్గమకాండము 25:8). ఇశ్రాయేలు గుడారం ఒక అద్భుతమైన నిర్మాణ కళాఖండం. దేవుని యొక్క అపారమైన మరియు అనంతమైన సన్నిధిని మూర్తీభవించడమే దాని ముఖ్య ఉద్దేశ్యం. అది నిర్మించబడటానికి ముందు, దేవుని సన్నిధి వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో, మరియు వేర్వేరు విధాలుగా ప్రత్యక్షమైంది. ఆదాము, హవ్వలకు వారు “యెహోవా దేవుడు తోటలో సంచరించుచున్న శబ్దము వినుచుండగా” (ఆదికాండము 3:8) ఆయన వారికి ప్రత్యక్షపరచుకొనెను. అబ్రాహామునకు ఆయన రాజుచున్న పొయ్యిగాను అగ్నిజ్వాలగాను తనను తాను ప్రత్యక్షపరచుకొనెను (ఆది. 15:17). యాకోబునకు ఆయన అతనితో పెనుగులాడగల మనిషిగా తనను తాను ప్రత్యక్షపరచుకొనెను (ఆది. 32:22–32). మోషేనకు ఆయన దహించబడని మండుచున్న పొదగా తనను తాను ప్రత్యక్షపరచుకొనెను (నిర్గ. 3:2). మరియు ఇశ్రాయేలీయులందరికి వారి అరణ్య ప్రయాణములో పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను (13:21–22) మరియు దట్టమైన మేఘముగాను, మెరుపుగాను, ఉరుముగాను, మరియు బూర ధ్వనిగాను తనను తాను ప్రత్యక్షపరచుకొనెను (నిర్గ. 19:9, 16).
అయితే, ఆ ప్రత్యక్షపు గుడారంతో ఒక కొత్త విషయం ఏర్పడింది. దేవుని సన్నిధి ఇకపై వచ్చిపోయే అతిథిలా కాకుండా, వారి మధ్యనే ఒక గుడారంలో నివసించే వ్యక్తిలా ఉండేది. ఆ ప్రత్యక్షపు గుడారం ఆయన రాజభవనంలా ఉండేది; అందులో తెరలో ఒక ద్వారం, దానిని కప్పే తెరలు, ఒక బల్ల దానిపై రొట్టెలు, వెలుగునిచ్చే దీపం మరియు ఆయన రాజ పాదపీఠంగా ‘మందసం’ వంటివన్నీ అమర్చబడి ఉండేవి.
ఈ నూతనత్వంలోని ఒక అంశం ఏమిటంటే, నిబంధన ప్రజలు ఇప్పుడు తమ మధ్య ప్రభువు సన్నిధిని అనుభవించగలిగేవారు; ఇది వారి పూర్వీకులకు సాధ్యం కాని విషయం. నేటి క్రైస్తవులకు కూడా ఇది ఎంతో బోధనాత్మకమైనది, ఎందుకంటే ఆ ప్రత్యక్షపు గుడారం అనేది మన మధ్య దేవుడు శరీరధారిగా నివసించడానికి ఒక ఛాయగా ఉండేది:
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను [నివసించెను అనే పదాన్ని “గుడారించబడెను” అని అనువదించవచ్చు]; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి (యోహాను 1:14)
ప్రభువు సన్నిధిని ఆయన నిర్ణయించిన పద్ధతిలో మాత్రమే అనుభవించగలము. ఆ పద్ధతులను ఆయన మోషేకు ఇలా తెలియజేశారు: “సమాగమ గుడారము యొక్కయు, దాని సమస్త ఉపకరణముల యొక్కయు నమూనాను నేను నీకు చూపించునట్లుగానే నీవు దానిని చేయవలెను” (నిర్గమకాండము 25:9). ఈ వృత్తాంతంలోని (అధ్యాయాలు 25–30) విశేషాలు ఈ విషయాన్ని మనకు స్పష్టం చేస్తాయి. దేవుడు తన ప్రజలమైన మనకు తనను తాను బయలుపరచుకుంటాడు; ఆయన వాక్యం ద్వారా మనం ఆయనకు దగ్గరై, ఆయనను తెలుసుకోగలము. ఆయన వాక్య సేవకుల ద్వారా మనకు బోధించమని ప్రభువు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మనం పాటిస్తున్నప్పుడు, “యుగ సమాప్తి వరకు [మనతో] ఎల్లప్పుడూ” ఆయన తోడై ఉంటాడన్న నిశ్చయతను మనం కలిగి ఉండవచ్చు (మత్తయి 28:19–20).
దేవుని సన్నిధిని ఆయన ఎన్నుకున్న సేవకులైన యాజకుల ద్వారా అనుభవించేవారు; వారు ఆ సన్నిధికి ప్రతినిధులుగా ఉన్నందున, ఇశ్రాయేలీయులు తమ పంచేంద్రియాల ద్వారా వారితో సంబంధం కలిగి ఉండగలిగేవారు. వారి వస్త్రధారణ కూడా దేవుని ప్రజలకు ఆయన సౌందర్యాన్ని మరియు మహిమను తెలియజేసేలా ఉండేది (నిర్గమకాండము 28:2). ప్రజలు ఉద్దేశపూర్వకంగానూ, పొరపాటుననూ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం మరియు పరిహారం కోసం, అలాగే తమ దేవుని కృపాపూర్వకమైన కార్యాలకు కృతజ్ఞతగా వారు బలులను అర్పించేవారు (లేవీయకాండము 1–7). వాస్తవానికి, ఈ బలి విధానంలో ఉన్న ఒక విశేషమైన అంశం ఏమిటంటే, ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎంతగా ఉండేదన్నదే. ప్రజలు బలి అర్పించడానికి తమ సొంత జంతువులను తీసుకువచ్చి, వాటి తలల మీద తమ చేతులు ఉంచి, తమ పాపాలను ఒప్పుకునేవారు. అంతేకాకుండా, ‘సమాధాన బలి’ విషయంలో, బలిపీఠంపై ఉన్న తన భాగాన్ని ప్రభువు “భుజించడం” మరియు యాజకులు తమ వాటాను పొందడమే కాకుండా, ప్రజలు కూడా అందులో కొంత భాగాన్ని భుజించేవారు (లేవీయకాండము 7:11–18).
తన వాక్యం ద్వారా, యాజకులు మరియు బలుల ద్వారా వ్యక్తమయ్యే కృపా చిహ్నాలు, అలాగే అక్కడ అర్పించబడే ప్రార్థనల ద్వారా తన ప్రజల మధ్య కృపా కనికరాలతో నివసించడానికి దేవుడు వారికి ఆ ప్రత్యక్షపు గుడారాన్ని అనుగ్రహించాడు. అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆయన నేడు కూడా మన మధ్య నివసిస్తున్నాడు (ఎఫెసీయులకు 2:18–22).
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్లో ప్రచురించబడింది.


