
నేను దైవభక్తిగల తండ్రిగా ఎలా ఉండగలను?
30/12/2025
కష్టాలు మరియు శోధనలలో పిల్లలకు మార్గదర్శకత్వం వహించడం
06/01/2026క్రైస్తవులు దుఃఖించడం సరైనదేనా?
కీత్ ఎవాన్స్
నిర్ణీత క్రమం అంటూ లేకుండా, తరచుగా సంభవిస్తూనే ఉంటుంది: ప్రశాంతంగా సాగిపోతున్న మన జీవితాల్లోకి బాధ చొరబడుతుంది, పదేపదే మన శాంతిని భంగపరుస్తుంది. తీవ్రమైన, బాధాకరమైన అనుభవాలు ఎలాంటి ఆహ్వానం లేకుండానే మనలోనికి ప్రవేశిస్తాయి. అవి ఆకస్మికంగా దూసుకువచ్చి, ఆ వేదనకు గురైన వారిని విలపించేలా, తీవ్ర శోకంలో మునిగిపోయేలా, మరియు బలహీనంగా భావించేలా చేస్తాయి. ఈ బాధాకరమైన దైవిక సంకల్పాలు (providences) నిజమైన హానిని, నష్టాన్ని తీసుకువస్తాయి. అంతేకాకుండా, అవి ఎప్పుడూ కోరుకున్న సమయానికి రావు, ఎందుకంటే నిజాయితీగా చెప్పాలంటే, కష్టాలను ఎదుర్కోవడానికి సరైన సమయం అంటూ ఏదీ లేదు.
అయినప్పటికీ, సంఘములో కొన్నిసార్లు ఒక ధోరణి కనిపిస్తుంది. అదేమిటంటే, మనం మన దుఃఖాన్ని, వేదనను దాచిపెట్టడానికి ప్రయత్నించాలి, సంతోషకరమైన ముఖాన్ని ధరించాలి, మరియు మనం ఎదుర్కొంటున్న ఈ సవాళ్ళన్నీ “బాగానే ఉన్నాయి” అన్నట్లుగా జీవితాన్ని గడపాలి. “మీరు ఎలా ఉన్నారు?” అనే సాధారణ పలకరింపుకు, మన అంతరంగం ఏమాత్రం “బాగా” లేకపోయినా, కృత్రిమంగా “నేను బాగున్నాను, ధన్యవాదాలు” అని బదులిస్తాం. మనం ఆరాధనకు వెళ్లి, మన ప్రస్తుత మనఃస్థితికి కాస్త అతి ఉల్లాసంగా అనిపించే కీర్తనలను ఆలపిస్తాం.
అయినప్పటికీ, క్రైస్తవులకు ప్రభువు బలం అండగా ఉంది కాబట్టి, వారు దుఃఖాన్ని స్వాగతించాల్సిన అవసరం లేదనే (లేక స్వాగతించకూడదనే) ఒక ఆలోచన తరచుగా కనిపిస్తుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాల ప్రభావాన్ని తక్కువ చేసి చూడటంలోనే నిజమైన బలం ఉందని కొందరు భావిస్తారు. అన్నిటికీ మించి, మనం రకరకాల శ్రమలను ఎదుర్కొన్నప్పుడు, వాటిని మహా సంతోషంగా ఎంచాలని (యాకోబు 1:2) పరిశుద్ధ లేఖనం స్పష్టంగా బోధిస్తోంది కదా!
అలాంటి దృక్పథాన్ని (అనగా, దుఃఖాన్ని దాచేయాలనే భావనను) కలిగి ఉన్నప్పుడు, విశ్వాసులు దుఃఖించడానికి అసలు చోటు ఎక్కడ ఉంది అనే ప్రశ్న మనకు మిగిలిపోతుంది. ఆ క్రమంలో, ప్రసంగి 7:2–4 వచనాల యొక్క లోతైన సత్యం మన దైనందిన వేదాంత చర్చలలో సులభంగా కనిపించకుండా పోతోంది:
విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు;
ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు.
నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును.
జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటిమీదనుండును; అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును.
లోకము దుఃఖించకుండా ఉండాలనుకోవడాన్ని మనం అర్థం చేసుకోగలం, ఎందుకంటే వారు నిరీక్షణ లేనివారివలె శోకిస్తారు (1 థెస్సలొనీకయులు 4:13). అలాంటి బాధను విడిచిపెట్టడానికి ప్రయత్నించడం లోక దృక్పథం నుండి సబబైనదిగానే అనిపించవచ్చు. అయితే, సంఘము సంగతి ఏంటి? బాధను చిన్నదిగా, అల్పమైనదిగా పరిగణించాలనే అబద్ధాన్ని మనం ఎందుకు నమ్మడానికి ప్రలోభపడతాము? ముఖ్యంగా, మనం దుఃఖమున్న ఇంటికి వెళ్లకుండా ఎందుకు తప్పించుకుంటాం? దానికి బదులుగా, విందులు, నవ్వులు, మరియు సంతోషమున్న ఇంటికి పరుగెత్తడానికి ఎందుకు మొగ్గు చూపుతాము?
బహుశా మనం, లోకము యొక్క తాత్కాలిక పరిష్కారాన్నే మనకు మనముగా బోధించడం మొదలుపెట్టామేమో: “తిందము, తాగుదము, సంతోషించుదము; రేపు చనిపోదుము గదా” (యెషయా 22:13; ప్రసంగి 8:15). దేవుని ఆది సంకల్పానికి, ఆయన సృష్టికి విరుద్ధమైన, అసహ్యకరమైన దానిని ఆయన మిక్కిలి మంచిదిగా చేసిన వాటన్నిటిలోకి చొచ్చుకువచ్చి, ఈ జీవితాన్ని, ఆశీర్వాదాన్ని, మరియు సమృద్ధిని కళంకం చేసిన దానిని మనం సమర్థవంతంగా తీసుకుని, ఆ చొరబాటుదారుడిని అది కానిదానిగా మార్చేశాము. మన పాపములో పడిపోవడం వలన వచ్చిన ఈ శత్రువును – దేవుని మంచి సంకల్పంలోకి చొరబడిన, దాడి చేసిన ఈ బాధను చూసి, “నీవు అంత చెడ్డవాడివి కావులే” అని మనం సులభంగా చెప్పేశాము. అయితే, దుఃఖాన్ని కేవలం నిర్వికారతతో (భావాలు లేని తటస్థ వైఖరితో) ఎదుర్కోవడానికి ప్రయత్నించడం కంటే దేవుని సత్యం ఎంతో ఘనమైనది.
దేవుని ప్రణాళికలో, విశ్వాసి తన తీవ్రమైన వేదనను యథాతథంగా “భయంకరమైనది” మరియు “అసహ్యకరమైనది” అని పిలవడం సరియైనదే. మనం దుఃఖమున్న ఇంటికి వెళ్లవచ్చు; ఈ దుఃఖాల భారమంతటినీ ప్రభువు దగ్గరకు సరిగా తీసుకుపోవచ్చు (1 పేతురు 5:7); మరియు వాటిని మనస్సుకు సరిగా తెచ్చుకోవచ్చు (ప్రసంగి 7:2). అన్నిటికీ మించి, కీర్తనల గ్రంథం భక్తిపూర్వకమైన విలాపాలతో నిండి ఉంది. వాస్తవానికి, బైబిల్లో దానికి అంకితం చేయబడిన ఒక గ్రంథం మొత్తం ఉంది అదే విలాపవాక్యములు!
దీనితో పాటుగా, దేవుడు యేసుక్రీస్తులో ఈ శాపమును జయించాడు అనే నిరీక్షణతో కూడిన సత్యాన్ని కూడా మనం ఏకకాలంలో కలిగి ఉన్నాము. ఆయన పాపం మరియు దుఃఖంతో కూడిన ఈ లోకాన్ని జయించాడు, మరియు మన జీవితాలలో తన మంచి సంకల్పాల కొరకు కష్టాలను తన ఆధీనంలోకి తీసుకుని, మన వేదనలన్నిటినీ కూడా విమోచించాడు. కాబట్టి, మనం నిరీక్షణ లేనివారివలె దుఃఖించము. మనం సరిగ్గా దుఃఖిస్తాము, కానీ ఆ దుఃఖం మధ్యలో కూడా ప్రభువు యొక్క మంచి ఏర్పాటును సరిగ్గా విశ్వసిస్తాము. ఈ సత్యాలు విరోధమైన ఉద్రిక్తతలో కాకుండా, భక్తిపూర్వకమైన ఏకత్వంలో నిలబడతాయి.
అందువల్ల, ప్రియమైన క్రైస్తవుడా, మనం సరిగ్గా దుఃఖిద్దాం. మనం కన్నీరు పెడదాం, శోకిద్దాం, కానీ నిరాశ చెందకుండా ఉందాం. మన సహోదర సహోదరీలు దుఃఖించడానికి మనం అనుమతిద్దాం; వారి శోకంపై నిషేధాజ్ఞ విధించకుండా ఉందాం, వారు మళ్లీ నవ్వడానికి ముందు క్రైస్తవులకు ఆమోదయోగ్యమైన పరిమితి అంటూ ఏదీ నిర్ణయించవద్దు. మరియు మనమందరం ధైర్యం తెచ్చుకుందాం, ఎందుకంటే ఈ లోకంలో మనం అన్ని రకాలైన కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, క్రీస్తు లోకాన్ని జయించాడు (యోహాను 16:33).
ఒక రోజు, కన్నుల ప్రతి ప్రతి బాష్పబిందువు తుడిచివేయబడుతుంది (ప్రకటన 21:4). కానీ ఈ రోజు ఆ రోజు కాదు. అప్పటి వరకు, లోకము యొక్క వేదనలో నిలిచి, “ప్రభువైన యేసూ, రమ్ము” అని మనం విశ్వాసముతో నిరీక్షిస్తూ మొరపెడతాము.
ఈ వ్యాసం క్రైస్తవ శిష్యత్వం యొక్క ప్రాథమిక అంశాలు అనే సేకరణలో భాగం.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్లో ప్రచురించబడింది.


